ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. బి కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, కురబలకోట, పెద్దమండ్యం మండలాల్లో ప్రజలు ఇప్పటికీ ప్రాథమిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్లు సరిగా లేక రవాణా ఇబ్బందులు, తాగునీటి కొరత, ఆస్పత్రులలో సదుపాయాల లేమి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నా… తమ ప్రాంతం మాత్రం వెనుకబడిందనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోతే సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు కూడా ప్రజల సమస్యలకు కారణమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం కొనసాగినా… ఇక్కడ మాత్రం వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సమస్యలు వినిపించుకునే పరిస్థితి లేదని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేపై అసంతృప్తి పెరుగుతుండగా… మరోవైపు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గం అభివృద్ధి మందగించిందనే అభిప్రాయం బలపడుతోంది.
మరోవైపు టిడిపి పార్టీలో ఏర్పడిన పరిస్థితులు కూడా తంబళ్లపల్లె రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన జయచంద్రా రెడ్డి నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ కావడంతో పార్టీకి ఇన్చార్జ్ లేకుండా పోయింది. దీంతో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు మందగించాయి. ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లే నాయకత్వం లేకపోవడంతో రాజకీయ శూన్యత నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తక్షణమే ఇన్చార్జ్ను నియమించాలని టిడిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం రెండూ కలిసొస్తేనే తంబళ్లపల్లె అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానికులు భావిస్తున్నారు.జనసేన , బీజేపీ నేతలు కూడా యాక్టీవ్ గా లేకపోవడంతో సమస్యలు పరిష్కరించే నాధుడే లేడని ప్రజలు అంటున్నారు .




Total views : 89974