కేరళలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కొట్టాయం జిల్లాలోని కిడంగూర్ మహావిష్ణు ఆలయంలో వార్షిక ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుండగా, ఒక్కసారిగా ఊహించని విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా అలంకరించిన ఒక ఏనుగు అకస్మాత్తుగా అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. చుట్టుపక్కల భక్తులు భయంతో పరుగులు తీస్తుండగా, ఆ గజరాజు తన కోపాన్ని వాహనాలపై చూపించింది.
అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక కారును, బైకును తన తొండంతో ఎత్తి పక్కకు విసిరేసింది. చూస్తుండగానే క్షణాల్లో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని గంటల పాటు శ్రమించి ఏనుగును మచ్చిక చేసుకుని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన మరోసారి కేరళలో ఏనుగుల వినియోగంపై పెద్ద చర్చకు దారితీసింది. ‘దేవుడి ఉత్సవాల పేరుతో మూగజీవాలను హింసించడం సరికాదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ శబ్దాలు, రద్దీగా ఉండే జనాల మధ్య ఏనుగులు ఒత్తిడికి లోనవుతాయని, అందుకే అవి ఇలా ప్రవర్తిస్తాయని వారు వాదిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఇలాంటి వేడుకల్లో ఏనుగులను వాడటం మానేసి, వాటిని అడవుల్లో స్వేచ్ఛగా వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం సంప్రదాయం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసం అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.






Total views : 75217