22A భూముల సమస్యల పరిష్కారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 22A జాబితాలో భూములు చేరడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమస్యపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించడంతో పాటు… ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
22A భూములకు సంబంధించి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. ఫిర్యాదు నమోదైన తర్వాత అది పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
తహసీల్దార్లు, ఆర్డీవోలు, సబ్రిజిస్ట్రార్లు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పొంగులేటి ఆదేశించారు. భూమి అసలు 22A జాబితాలోకి ఎందుకు చేరింది? ఎలాంటి కారణాలతో నిషేధిత జాబితాలో నమోదైంది? అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి… వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని స్పష్టం చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా… సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.