ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొన్ని రోజులుగా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వాన ఊరటనిచ్చింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం నగరంలో తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా అంతటా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జిల్లాలో తెల్లవారుజాము నుంచే పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, సారవకోట, మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లో వాన కురిసింది. కడప జిల్లా లింగాల మండల పరిధిలోని గుణకనపల్లి, రామట్లపల్లి, చిన్నకుడాల, మురారిచింతలతో పాటు పలు గ్రామాల్లో గురువారం రాత్రి వీచిన వాన గాలులకు వందల ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైంది. దీంతో ఉద్యానవన శాఖ అసిస్టెంట్ యువతేజ నేలమట్టమైన అరటి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.





Total views : 75225