రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలుఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పాల్గొని పోలీసు సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులు అర్పించారు. అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు అమరులను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ 1993 నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో మరణించిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు.
Telangana
ఖమ్మం పట్టణంలోని తుమ్మల గడ్డలో ఈరోజు నిర్వహించిన మైనారిటీ ఆత్మీయ సమావేశం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ … మైనార్టీల సంక్షేమం తో పాటు వారికి రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డానని అన్నారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారని అన్నారు . ఖమ్మం పట్టణంలో రహదారులు , మున్నేరు పై హైలెవల్ బ్రిడ్జ్ లతో ప్రగతి బాటలు వేశానని ,అరాచక, అవినీతిలేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలని సూచించారు.
రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండడంతో మార్కెట్లో రూ.2 వేల నోటును వ్యాపారులు తీసుకోవడంలేదు. పెద్ద నోటు ఇస్తే చిల్లర లేదంటూ వద్దంటున్నారని పలువురు చెబుతున్నారు. మార్కెట్లో మాత్రమే కాదు ప్రభుత్వ సంస్థలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా పెద్ద నోట్లు తీసుకోవద్దంటూ కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి రూ.2 వేల నోటును అంగీకరించ వద్దని చెప్పింది. నోట్ల మార్పిడికి గడువు దగ్గర పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా రూ.500 కొత్త నోట్లను, రూ.2 వేల నోటును తీసుకురానున్నట్లు చెప్పారు. పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ మార్కెట్లోకి విడుదల చేసిన రూ. 2 వేల నోటు తాత్కాలిక సౌలభ్యం కోసమేననే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. దీనికి బలం చేకూర్చేలా 2019లో రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపి వేసింది. ఇటీవల ఈ నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ముందుగా సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా వ్యవహరించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు. పలువురు పోలీసు అమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సీపీ సన్మానించారు.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని, సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మన దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కాదని, సుభాష్ చంద్రబోస్ ప్రథమ ప్రధాని అన్నారు. నేతాజీ బ్రిటిష్ వారికి భయం రుచిచూపించడం వల్ల వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారన్నారు. భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల లేదా సత్యం, ధర్మం అంటూ ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించడం వల్ల కానీ స్వాతంత్ర్యం రాలేదన్నారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ములుగు పర్యటన నేపథ్యంలో మంత్రిని కలిసేందుకు వస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. కొండ్రాయి గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మహిళలు మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తుండగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే మీటింగ్ కు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడమేంటని నిలదీశారు. మంత్రి హరీశ్ రావు సభ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని చెప్పారు. బాధితులను కలిసిన ఎమ్మెల్యే సీతక్క.. అక్కడి నుంచే పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి అరెస్టులపై ప్రశ్నించారు. తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం ఇచ్చే అవకాశం ఇవ్వరా? అంటూ నిలదీసిన సీతక్క.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్థాన్ లోనా? అని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలను కూడా పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు.
ఇండ్లు కోల్పోయిన బాధితులు మంత్రిని కలిసేందుకు వీలులేకుండా పోలీస్ స్టేషన్ లో బంధిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ తమకు కావాల్సిన వారిని ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చి తీసుకొస్తున్నారని, సాధారణ ప్రజలను మాత్రం జైలులో పెడుతున్నారని విమర్శించారు. వారు ప్రజలు కాదా అని ప్రశ్నించారు. బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వివరించారు.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేశామన్నారు. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్కు సంబంధించి దిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు.. కానీ, మహిళలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మరోవైపు.. ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, బషీర్బాగ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో గణేష్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిన కూడా నిమజ్జనం కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 173 ఓట్లలో 169 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. Hca పీఠం ఎవరికి దక్కనుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే ప్రెసిడెంట్ రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు ముందంజలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలత ప్రెసిడెంట్ స్థానాన్నే అనౌన్స్ చేయనున్నారు ఎన్నికల అధికారి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓజా మిథాలీ రాజ్, వెంకటపతి రాజు, స్రవంతి పలువురు క్లబ్ నెంబర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ ps పరిధిలోని మేడ్చెల్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సుచిత్ర సమీపంలోని రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు యజమాని కారును రోడ్డు ప్రక్కన ఆపి దిగి చూశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. కానీ ఎగిసి పడ్డ మంటల్లో కారు పూర్తిగా దగ్దమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.





Total views : 81798