Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

by CVR NEWS
కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణలో వరి ధాన్యం, మొక్క జొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణలో ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఏ మేరకు జరుగుతుందనే వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లోగా గోడౌన్లకు తరలించాలని ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి..ధాన్యం లోడింగ్‌కు ఒప్పందం ప్రకారం సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడొద్దని అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడదని తెలిపారు. గోడౌన్ల సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ధాన్యం నిల్వ చేసేందుకు రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను సేకరించి, ధాన్యాన్ని అక్కడికి తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీలును బట్టి అక్కడి నుండి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశించారు. అవసరమైన చోట పోలీసుల సాయం తీసుకుని ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని, కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సీఎస్ రామకృష్ణా రావు‌కు నివేదిక పంపాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

Advertisements

You may also like

Our Visitor

023330
Total views : 141768

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.