ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దేవాదాయ శాఖలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఎండోమెంట్ కమిషనరేట్ ఛార్జ్ మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. 2017లో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఈవోగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఆలయానికి సంబంధించిన బంగారం, రికార్డులు, ఖర్చులపై సమగ్ర విచారణ కొనసాగింది. అప్పట్లో సస్పెన్షన్కు గురైనప్పటికీ, తిరిగి పదవిలోకి రావడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఇక పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో రాజకీయ ప్రభావం, ఆర్థిక బలం కీలక పాత్ర పోషించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ కేసు తీవ్రతను తగ్గించి, డిపార్ట్మెంటల్ విచారణకు మళ్లించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెనుసుల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డీసీగా కొనసాగుతున్న ఆయన, ఛార్జ్ మెమో జారీ అనంతరం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం గమనార్హం. మరోవైపు నగరంలోని ఖరీదైన భూముల రికార్డులను తారుమారు చేశారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిషనరేట్ ఆదేశించడంతో, తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.






Total views : 75452