పచ్చదనం పేరుతో ప్రజల నమ్మకంపై దెబ్బకొట్టారు. లాభాల పేరు చెప్పి దండుకుంటున్నారు. సామాన్యులకు గుండుసున్నా కొడుతున్న ఈ స్కాం సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సీవీఆర్ న్యూస్ పరిశోధనలో అక్రమం బయటపడింది. హరితవనం అనే పేరుతో అక్రమ వెంచర్ కోట్లాది రూపాయల దందాగా మారింది. రైతుల భూములు చౌకగా కొనుగోలు చేసి నగర ప్రజలను టార్గెట్ చేస్తూ భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు. అందరి కళ్లముందే ఈ దందా సాగుతున్నా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ స్కాం వెనుక అసలు నిజం ఏంటి? ఎవరి అండతో ఈ అక్రమం సాగుతోంది?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ నాగిల్గిద్ద మండలం మోర్గి గ్రామ శివారుల్లో హరితవనం పేరిట నడుస్తున్న అక్రమ వెంచర్ సంచలనం రేపుతోంది. 23వ సర్వే నంబర్లో మొత్తం 35 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. 21 మంది పట్టాదారులు ఉన్నారు. ఆ భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు. తర్వాత అదే భూమిని ప్లాట్లుగా మార్చేశారు. పూలు, ఖర్జూర మొక్కలు నాటారు. గ్రీన్ ప్రాజెక్ట్ అంటూ ఆకర్షణీయమైన అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చారు.
ఇంకేముంది… ప్రధానంగా హైదరాబాద్ ప్రజలను టార్గెట్ చేశారు. ఒక గుంట ధరను లక్షా 50 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు నిర్ణయించారు. అంతటితో ఆగలేదు. ప్రతి ఆదివారం కార్లలో ఉచితంగా తీసుకెళ్తున్నారు. విందులతో కస్టమర్లను మభ్యపెట్టి అగ్రిమెంట్లు చేయిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన సీవీఆర్ న్యూస్ ప్రతినిధులను బెదిరించారు.
బౌన్సర్లతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఇక వెంచర్ యజమాని గంగాధర్ అయితే.. నన్నే ప్రశ్నిస్తారా? అంటున్నారు. ఇక ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. స్థానిక రాజకీయ నేతలు నోరు మెదపడం లేదు. ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తున్నారు. మండల పరిధిలో అన్ని అక్రమాలను ప్రశ్నించి, రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన తహసీల్దార్ అయితే కళ్లుండీ కబోదిలా మారిపోయారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తెగించి మాట్లాడుతున్నారు. మీకు నచ్చింది రాసుకోండి అంటున్నారు.
ఈ అక్రమ వెంచర్ వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ప్రజల డబ్బుతో జరుగుతున్న ఈ మోసం ఎప్పుడు ఆగుతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు? ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నట్లు? జాయింట్ కలెక్టర్, కలెక్టర్ పాత్ర ఏంటి? ఈ అక్రమం ఇంత బహిరంగంగా ఎలా సాగుతోంది?





Total views : 75304