కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేయవద్దని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని హెచ్చరిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి. ఒకవేళ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, రాబోయే ఎన్నికల్లో పార్టీ మరిన్ని ఓటములను చవిచూడాల్సి వస్తుందని ఆ పోస్టర్లలో హెచ్చరించారు.
కేసీ వేణుగోపాల్ను సీఎంగా ప్రకటిస్తే.. వయనాడ్లో అమేథి వంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ చవిచూడాల్సి వస్తుందని పోస్టర్లలో హెచ్చరించారు. ఈ పరిణామం కేరళం కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. ముఖ్యంగా వయనాడ్ వంటి కీలక నియోజకవర్గంలో, పార్టీ నాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్పైనే సొంత పార్టీ శ్రేణుల నుంచి ఈ స్థాయిలో నిరసన వ్యక్తం కావడం పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఈ పోస్టర్ల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పార్టీ స్థానిక నాయకత్వం ఆరా తీస్తోంది.






Total views : 74948