“తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిక్షిప్తమైందని చెప్పిన మహానుభావుల మాటలు… నేటి పాలకుల చెవుల్లో వినిపించడం లేదా?” అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి మనసులో మెదులుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు నిధుల కోతలు విధిస్తూ… మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్న విధానం తీవ్ర విమర్శలకు గురవుతోంది. నిబంధనలు పాటించని పాఠశాలలు… సరైన భవనాలు లేకపోయినా, క్రీడా స్థలాలు లేకున్నా… అనుమతులు లేకుండా నడుస్తున్నా… అధికార యంత్రాంగం ఎందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల భద్రత, విద్యా నాణ్యత కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా అనే ప్రశ్నలు వెళ్లివేత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అవుతుండగా… ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్న ఈ పరిస్థితిపై సమగ్ర పరిశీలన అవసరం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై, అధికారుల నిర్లక్ష్యంపై సివిఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ మీ ముందుకు తీసుకొస్తోంది.
సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందా? బకాయిల చెల్లింపులో ప్రభుత్వాల నిర్లక్ష్యం సంస్థను ముంచేస్తోందా? అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సింగరేణిని కాపాడుకునేందుకు సిఐటియు పోరుబాట పట్టింది. కార్మిక హక్కుల సాధన కోసం ఈ నెల 28న విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. గోదావరిఖని వేదికగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.నల్లబొగ్గు గనుల్లో సెగలు పుడుతున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మాట్లాడిన సిఐటియు నేత తుమ్మల రాజిరెడ్డి, అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 22 వేల కోట్ల బకాయిలు ఇవ్వకపోతే సంస్థ మనుగడ సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని, దీనిపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.




Total views : 54831