వరుస పేలుళ్లతో పంజాబ్ దద్దరిల్లింది. రెండు గంటల్లో 2 చోట్ల పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. రాత్రి జలంధర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. కార్యాలయం బయట పార్క్ చేసి ఉన్న యాక్టివ్ పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. కిలోమీటరు వరకు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ పేలుడులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైనా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అమృత్సర్లో మరో పేలుడు జరిగింది. అటారీ రోడ్డులోని ఆర్మీ ఖాసా కంటోన్మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో రేకును పోలిన శకలాలు దొరికాయని..దీంతో ఎవరో పేలుడు పరికరాన్ని విసరడం వల్లే ఈ పేలుడు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, దాడి చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు ఘటనలూ ఆర్మీ యూనిట్లకు సమీపంలోనే జరగడం మరింత ఆందోళనలను రేకెత్తిస్తోంది.






Total views : 74910