ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నాలుగు కొత్త లేబర్ కోడ్లను పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 29 పాత చట్టాల స్థానంలో వచ్చిన ఈ కొత్త నిబంధనలు కార్మికుల పనితీరు, వేతనం, సామాజిక భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ మార్పుల వల్ల అటు కంపెనీలకు నిబంధనల సరళీకరణతో పాటు, ఇటు కార్మికులకు మెరుగైన హక్కులు కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. 2025 నవంబర్లోనే ఇవి చట్టాలుగా మారాయని, డ్రాఫ్ట్ రూల్స్ పబ్లిష్ చేసి భాగస్వాముల సూచనలు కోరారని ఓ అధికారి వివరించారు. వాటిని న్యాయ పరీక్ష చేసి తాజాగా నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో ఈ లేబర్ కోడ్ చట్టాల అమలుకు అవసరమైన ప్రక్రియ ముగిసిందని తెలిపారు. అయితే, కార్మిక శాఖ ఉమ్మడి జాబితాలో ఉండే అంశమని, అందుకే రాష్ట్రాలు కూడా నోటిఫై చేస్తే.. ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
కొత్త నిబంధనల ప్రకారం వారానికి పని గంటలను గరిష్టంగా 48 గంటలుగా నిర్ణయించారు. కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడం తప్పనిసరి చేయడంతో పాటు, అదనపు సమయం పనిచేస్తే దానికి తగ్గట్టుగా ఓవర్ టైమ్ భత్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, పారదర్శకత కోసం ప్రతి ఉద్యోగికీ తప్పనిసరిగా నియామక పత్రం జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 40 ఏళ్లు దాటిన కార్మికులకూ ఏటా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, రాత్రి వేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు పటిష్టమైన భద్రత కల్పించే బాధ్యతను యజమానులకే అప్పగించారు.
ఈ మార్పుల వల్ల నెలవారీ చేతికి వచ్చే జీతంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొత్త వేతన నిబంధనల ప్రకారం.. ఉద్యోగి మొత్తం జీతంలో ప్రాథమిక వేతనం కనీసం 50 శాతంగా ఉండాలి. దీనివల్ల నెలవారీగా చేతికి అందే నగదు స్వల్పంగా తగ్గినప్పటికీ.. పీఎఫ్, గ్రాట్యుటీ వాటా పెరగడం వల్ల పదవీ విరమణ తర్వాత కార్మికులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు, ఇప్పటివరకు ఎలాంటి భద్రత లేని డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని నిబంధనలను ఖరారు చేసిన వెంటనే ఇవి క్షేత్రస్థాయిలో అమల్లోకి రానున్నాయి.





Total views : 75044