దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. రాజస్థాన్లోని జమ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు ఈ లీకేజీలో కీలకపాత్ర పోషించారు. వీరు పరీక్షకు వారం రోజుల ముందు, ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఓ డాక్టర్ నుంచి 30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ తర్వాత సికార్లో నీట్ కోసం సిద్ధమవుతున్న తమ కుటుంబంలోని ఓ విద్యార్థికి ఆ పేపర్ను పంపించారు.
దీంతో పేపర్ లీక్ కుంభకోణానికి రాజస్థాన్లోని సికార్ కేంద్రంగా మారినట్లు విచారణలో స్పష్టమైంది. రాజస్థాన్ సోదరుల నుంచి పేపర్ పొందిన ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్ మందవారియా దానిని పలువురికి విక్రయించాడు. ఆ తర్వాత సికార్లో పీజీ హాస్టల్లోని విద్యార్థులకు చేరింది పేపర్. దీంతో ఈ లీకేజీకి మూలం నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్ అని, అక్కడి నుంచి ఓ ‘చైన్ నెట్వర్క్’ ద్వారా గురుగ్రామ్ డాక్టర్కు చేరినట్లు రాజస్థాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. సికార్ నుంచి ఈ పేపర్ జమ్మూకశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చేరినట్లు ఆధారాలు లభించాయి. ఏజెంట్ రాకేష్ కుమార్ సుమారు 700 మంది విద్యార్థులకు పేపర్ను పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మే 3న జరిగిన నీట్ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ, పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాకేష్ కుమార్ మందవారియా, యశ్ యాదవ్తో పాటు నాసిక్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరీక్ష తేదీలను 7 నుంచి 10 రోజుల్లో ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA తెలిపింది.





Total views : 75045