రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21 వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్ నగరానికి దూరంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించడం వల్ల జరిగిన నష్టం కళ్లముందే కనిపిస్తున్నదని అటువంటి తప్పు పునరావృత్తం కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిథిలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాలను గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆనాటి ప్రభుత్వం నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో 2బిహెచ్ కె ఇండ్లను నిర్మించి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వారికి కేటాయించడం వల్ల తమ జీవనోపాథికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇండ్లు తీసుకున్న లబ్ధిదారులు అక్కడ నివసించడానికి సంసిద్ధతం వ్యక్తం చేయడం లేదని క్షేత్ర స్థాయి పరిశీలనల్లో స్పష్టమైందన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలోనే ప్రభుత్వ స్థలాలు, మురికివాడలు, భూదాన్, గతంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లు శిధిలావస్థలో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ విషయంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలని అధికారులను ఆదేశించారు.






Total views : 74910