వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్ మట్టి కోటలో ఉన్న పురాతన శివాలయాన్ని అధికారులు కూల్చివేశారంటూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ ఆలయానికి 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో చారిత్రక సంపదను ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆరోపించారు. పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించలేదని విమర్శించారు. కూల్చివేతకు కారణమైన కాంట్రాక్టర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, అదే ప్రదేశంలో అదే శిల్పకళతో ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆలయ భూములను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.






Total views : 74909