మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్లో కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఆధునిక మార్కెట్లను మంజూరు చేయగా, నాగారం మున్సిపాలిటీకి రూ.4.5 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే నాగారం మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నాలుగేళ్లు గడుస్తున్నా పనులు తిరిగి ప్రారంభం కాకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాంపల్లి, గోధుమకుంట, కరీంగూడ, బోగారం తదితర ప్రాంతాలకు సరైన మార్కెట్ సదుపాయం లేక ప్రజలు రోడ్లపైనే కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ లేకపోవడంతో చిరు వ్యాపారులు ఎండలోనూ, వర్షంలోనూ రోడ్లపైనే వ్యాపారం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు, పరిశుభ్రత లోపాలు లతో పాటు దొంగతనాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం ఆలస్యం కావడంతో నాగారం డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రస్తుతం రోడ్లు పైనే సంతలు ఏర్పాటు చేస్తున్నారు . కూరగాయల విక్రేతలు, మాంసం వ్యాపారులు ఎక్కడ స్థలం దొరికితే అక్కడే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ఆహార పదార్థాలు తడిసిపోతుండగా, ఎండకాలంలో వ్యాపారులు నిలబడలేని పరిస్థితి నెలకొంది. కొనుగోలుదారులకు కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర అసౌకర్యం ఎదురవుతోంది. పరిశుభ్రత లేకపోవడంతో చెత్త పేరుకుపోయి దుర్వాసనలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేసి ఆధునిక సదుపాయాలతో మార్కెట్ను ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నాగారం డివిజన్లో నిర్మాణం ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి కాకపోవడంతో చిరు వ్యాపారులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. సరైన మార్కెట్ లేక రోడ్లపైనే వ్యాపారం చేయాల్సి రావడంతో రోజువారీ జీవనం భారంగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రారంభించిన మార్కెట్ పనులు రాజకీయ, పరిపాలనా మార్పుల కారణంగా నిలిచిపోయాయని స్థానికులు అంటున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినా ఫలితం కనిపించకపోవడం ప్రజల్లో అసంతృప్తి పెంచుతోంది. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేసి మార్కెట్ను ప్రారంభిస్తే ప్రజలకు, వ్యాపారులకు ఎంతో ఊరట లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




Total views : 81759