తెలంగాణ రాజకీయం మరోసారి సెగలు కక్కుతోంది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ సభల ద్వారా సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. త్వరలోనే తెలంగాణ గడ్డపై ప్రధాని మోడీ టూర్ రాజకీయంగా నిప్పులు రాజేస్తోంది. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ విమర్శల దాడికి సతమతమవుతున్న బీఆర్ఎస్కు కవిత పార్టీ కొత్త టెన్షన్గా మారింది. కారు స్పీడ్కు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏ మేరకు బ్రేకులు వేయగలుగుతుంది అనే విషయం పక్కన పెడితే ..బీఆర్ఎస్ ఇంటి గుట్టును కవిత ఏ మేరకు డ్యామేజ్ చేయబోతున్నారు అనేది గులాబీ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యూహరచం చేస్తున్నట్లు తెలుస్తోంది.
()రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ దాదాపు ఏడాది విరామం తర్వాత ..మొన్నటి జగిత్యాల సభతో ప్రజల ముందుకు వచ్చారు. ఈ సభ ద్వారా ఆయన తిరిగి కమ్ బ్యాక్ ఇచ్చారనే జోష్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ, ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా ఆయన మరో భారీ వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించబోతున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీశ్ రావు.. మా పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారని స్పష్టం చేశారు. ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించగా… ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రకు ప్రణాళికలు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల కాలం మిగిలి ఉంది. దీంతో కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఎప్పుడు ఉండబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది. కాగా..ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో..ఆ పార్టీలో కొత్త ఊపు వచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ స్కెచ్ వేస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి..




Total views : 56584