ఇక ఇటు తెలంగాణలోనూ వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జగిత్యాల జిల్లాలో మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం వెనుక ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టుకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్ మండలాల్లో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, మియాపూర్, మాదాపూర్ చందానగర్ తదితర ప్రాంతాలలో భారీగా జల్లులు పడుతున్నాయి. దీంతో రోడ్లన్ని జలమయ్యాయి. తీవ్రమైన ఎండలతో తల్లడిల్లిపోయిన ప్రజలకు.. ఈ భారీ జల్లులు కొంత మేర ఉపశమనం కలిగించాయి.





Total views : 89125