Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

by CVR NEWS
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. సేవా కార్యక్రమాలకు వేదికగా నిలిచిన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మరోసారి మానవత్వాన్ని చాటింది. భారీ స్థాయిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు, యువత, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేస్తున్న దాతలను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభినందించారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సేవా కార్యక్రమాలతో సందడిగా మారింది. రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, యువత తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు, స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసేందుకు ఇక్కడికి తరలివచ్చారు. క్యూ లైన్లలో నిలబడి మరీ యువత తమ సేవాభావాన్ని చాటుకున్నారు. రక్తదాతల ఉత్సాహంతో ట్రస్ట్ భవన్ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. రక్తదానం మహాదానం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అవసరమైన సమయంలో ఒక్క యూనిట్ రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడగలదు. వైద్య బృందాల పర్యవేక్షణలో రక్తదానం ప్రక్రియను నిర్వహించారు. రక్తదాతలకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం రక్త సేకరణ చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులు, యువత.. రక్తాన్ని దానం చేసేందుకు పోటెత్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. రక్తదాతలను స్వయంగా కలిసి అభినందించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ట్రస్ట్ లక్ష్యమన్నారు. రక్తదానం ద్వారా అనేక కుటుంబాలకు ప్రాణభిక్ష లభిస్తుందన్నారు. ప్రస్తుత కాలంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం కొరత తీవ్రమవుతోందని… అలాంటి సమయంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని భువనేశ్వరి అన్నారు. సేవా కార్యక్రమాలు కేవలం ఒక రోజు కోసం కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో రక్తదానం చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే సిద్ధాంతాన్ని ఎన్టీఆర్ నమ్మారని నారా భువనేశ్వరి తెలిపారు. ఆ నమ్మకమే ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్‌ను నడిపిస్తోందన్నారు. ఎండలను సైతం లెక్కచేయకుండా, రక్తదానం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ ఆమె పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు లక్షలాది మందికి ఉచితంగా రక్తాన్ని సరఫరా చేశామని ఆమె తెలిపారు. ముఖ్యంగా ప్రాణాంతకమైన ‘తలసేమియా’ వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లల ప్రాణాలను కాపాడటంలో ఈ రక్తం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సేకరించిన ప్రతి రక్తపు బొట్టును ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేద రోగులకు, నిరుపేద బాలింతలకు ఉచితంగా చేరవేస్తున్నామని భువనేశ్వరి సగర్వంగా ప్రకటించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా విద్య, వైద్యం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ రక్తదాన శిబిరానికి వచ్చిన యువత కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని నారా భువనేశ్వరి తెలిపారు. తమ రక్తం ద్వారా ఎవరికైనా ప్రాణం దక్కుతుందనే భావన ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. మరింత మంది యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు.
రక్తదాన శిబిరంలో పాల్గొన్న మహిళలు కూడా సమాజ సేవలో పాల్గొనడం ఎంతో ముఖ్యమన్నారు. అవసరమైన సమయంలో మహిళలు కూడా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రక్తదానం అనేది కేవలం ఒక సేవ కాదు, అది ఒకరి కుటుంబంలో వెలుగులు నింపే దైవకార్యమని భువనేశ్వరి తెలిపారు. భవిష్యత్తులో కూడా యువత ఇదే జోష్‌తో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహానాయకుడు ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన ఆశయాలు, ఇలాంటి సేవా కార్యక్రమాల రూపంలో ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటాయన్నారు నారా భువనేశ్వరి.

కార్యక్రమం మొత్తం సేవా స్పూర్తిని ప్రతిబింబించేలా కొనసాగింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడతామని ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రాణాలను కాపాడే మహోన్నత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సమాజానికి ఉపయోగపడే పనుల్లో ముందుండాలని ఈ సందర్భంగా నేతలు, నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018660
Total views : 89117

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.