ఒకప్పుడు భారత దేశ ఎడ్టెక్ రంగాన్ని శాసించిన బైజూస్ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్కు సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అంతేకాదు, భారీ మొత్తంలో న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బీర్ ఇన్వెస్ట్కో సంస్థకు సంబంధించిన యాజమాన్య పత్రాలు సమర్పించాలన్న కోర్టు ఆదేశాలను ఆయన పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోర్టు ధిక్కరణ కేసులో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వేల కోట్ల విలువ కలిగిన స్టార్టప్ను నిర్మించిన రవీంద్రన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో సంస్థలోని పెట్టుబడిదారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బైజూస్ భవిష్యత్తుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
బైజూస్ పతనం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 2022లో దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ సంస్థ, ప్రస్తుతం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కంపెనీ విలువను భారీగా తగ్గించాయి. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఒకప్పుడు స్థానం సంపాదించిన బైజు రవీంద్రన్, ఇప్పుడు ఆ జాబితా నుంచి పూర్తిగా బయటకు వెళ్లిపోయారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో వాటాదారులు ఆయనను సీఈఓ పదవి నుంచి తప్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం, వ్యాపార కార్యకలాపాలు మందగించడం, అప్పులు పెరగడం సంస్థను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. ఒకప్పుడు భారత్ కు చెందిన ఈ స్టార్టప్ ప్రపంచానికి ప్రతీకగా నిలిచింది . బైజూస్ ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలకు ఉదాహరణగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ పునరుద్ధరణ సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ చర్చకు దారితీస్తోంది.
సింగపూర్ కేసుతో పాటు అమెరికాలో కూడా బైజు రవీంద్రన్కు భారీ చట్టపరమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోన్ ఒప్పందాలను ఉల్లంఘించి వేల కోట్ల రూపాయలను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలపై అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జ్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. తీసుకున్న నిధులను సొంత అనుబంధ సంస్థలకు బదిలీ చేశారనే ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇదే సమయంలో భారత్లో కూడా ఈడీ, జీఎస్టీ విభాగాలు, ఇతర ఆర్థిక సంస్థలు బైజూస్ వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఫెమా ఉల్లంఘనలు, పన్నుల ఎగవేత, స్పాన్సర్షిప్ బకాయిలు, ఇన్సాల్వెన్సీ కేసులు సంస్థను చుట్టుముట్టాయి. ఒకప్పుడు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థ ఇప్పుడు న్యాయపరమైన పోరాటాల్లో చిక్కుకుపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టార్టప్లలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో బైజూస్ ఉదంతం మరోసారి గుర్తు చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చూడాలి బైజూస్ వ్యవహారం ఎటు వెళ్తుందో మరి .





Total views : 89125