దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా అస్సాంలో వరదల ధాటికి మృతుల సంఖ్య 66 కు చేరగా… గుజరాత్లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు ఉప్పొంగడంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అస్సాం, గుజరాత్ వరదలపై ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
( ) దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఒకవైపు ఈశాన్య భారతంలో అస్సాం వరదలతో అల్లాడుతుంటే… మరోవైపు పశ్చిమ భారతంలోని గుజరాత్లో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వేలాది కుటుంబాలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అస్సాంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. భారీ వర్షాలు, వరదల ధాటికి మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 66కు చేరింది.బ్రహ్మపుత్రతో పాటు అనేక ఉపనదులు ఉప్పొంగడంతో పలు జిల్లాలు నీటమునిగాయి. లక్షలాది మంది ప్రజలు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
( ) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. గుజరాత్లోనూ భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు పలు నగరాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునగడంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. పలు జాతీయ రహదారులపై రాకపోకలు అంతరాయం కలిగింది.
( ) భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ మరిన్ని వర్షాల అవకాశం ఉందని తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండగా… పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల తీవ్రత ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. అస్సాంలో ప్రాణనష్టం పెరుగుతుండగా… గుజరాత్లో వరదల ప్రభావం విస్తరిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వర్షాలు తగ్గితేగానీ..సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాల్లో వరద ముప్పు కొనసాగుతూనే ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.