టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక విమానయాన సంస్థ ‘ఏయిర్ ఇండియా’లో పెను తుఫాను రేగింది. ఒకవైపు భారీ నష్టాలు.. మరోవైపు వరుస విమాన ప్రమాదాలు సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సంక్లిష్ట సమయంలో, సంస్థ సారథి క్యాంప్బెల్ విల్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పదవీకాలం ముగియకముందే ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది. అసలు ఏయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది? మహారాజా పతనం వెనుక ఉన్న కారణాలేంటి?
టాటా గూటికి చేరిన తర్వాత ఏయిర్ ఇండియా దశ మారుతుందని అందరూ భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. ఏయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తన పదవికి గుడ్-బై చెప్పారు. 2027 జూలై వరకు పదవీకాలం ఉన్నప్పటికీ, ఏడాది ముందే ఆయన తప్పుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022లో బాధ్యతలు చేపట్టిన విల్సన్, ఐదేళ్ల కాంట్రాక్ట్ ముగియకముందే విమానం దిగిపోవడం టాటా గ్రూపుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
రాజీనామాకు ప్రధాన కారణం ఆకాశమంత పెరిగిన నష్టాలే అని తెలుస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఏయిర్ ఇండియా ఏకంగా 20 వేల కోట్ల నష్టాన్ని చవిచూడబోతోందని అంచనా. ఆర్థిక నష్టాలు ఒకవైపు ఉంటే.. భద్రతా లోపాలు మరోవైపు వేధిస్తున్నాయి. గత ఏడాది జరిగిన బోయింగ్ విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత అహ్మదాబాద్ ప్రమాదం వంటి ఘటనలు విల్సన్పై ఒత్తిడిని పెంచాయి. రెగ్యులేటరీ సంస్థల నిఘా పెరగడం, అంతర్జాతీయంగా ఇమేజ్ డ్యామేజ్ కావడం రాజీనామాకు దారితీసినట్లు సమాచారం.
కేవలం అంతర్గత సమస్యలే కాదు.. భౌగోళిక రాజకీయాలు కూడా ఏయిర్ ఇండియాను దెబ్బతీశాయి. పాకిస్థాన్ గగనతలం మూసివేతతో రూట్లు మారడం. ఇజ్రాయెల్-ఇరాన్ టెన్షన్లతో పశ్చిమ దేశాల సర్వీసులపై ప్రభావం. బారెల్ ముడిచమురు ధర 100 డాలర్లు దాటడం.. సంస్థ బడ్జెట్ను కుదిపేసినట్లు సమాచారం. 30 ఏళ్ల అనుభవం ఉన్న విల్సన్ లాంటి దిగ్గజమే చేతులెత్తేస్తే.. ఇక ఏయిర్ ఇండియా భవిష్యత్తు ఏంటి? 191 విమానాలతో గాల్లోకి ఎగురుతున్న మహారాజాను.. నష్టాల సుడిగుండం నుండి కొత్త సీఈఓ గట్టెక్కించగలరా? లాభాల బాట పట్టించడం సాధ్యమేనా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.




Total views : 56950