ఏపీలో చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి . అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ కార్యాలయాలు ఈ కోవలోకే చేరతాయి . రెండు దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, హెడ్ పోస్ట్ ఆఫీస్ కొనసాగుతున్న పరిస్థితి . కోట్ల రూపాయల విలువైన సొంత స్థలాలు ఉన్నప్పటికీ, ఇంకా అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ, కోట్ల రూపాయల ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సరైన సౌకర్యాలు లేమీతో కొట్టుమిట్టాడుతుంది . పనులు కోసం వచ్చే జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు . శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని పునర్నిర్మించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. మరోవైపు, ప్రధాన తపాల కార్యాలయం పరిస్థితి అంతే . విస్తృత పరిధిలో సేవలు అందిస్తూ వేలాది మంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ శాశ్వత భవనం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కొత్త భవన నిర్మాణం ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. అద్దెల రూపంలో ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి . ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
రామచంద్రపురంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం , హెడ్ పోస్ట్ ఆఫీస్ రెండు దశాబ్దాలుగా అద్దె భవనాల్లో కొనసాగడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనంగా మారింది. రోజూ వందలాది మంది ప్రజలు ఈ కార్యాలయాలపై ఆధారపడుతూ సేవలు పొందుతున్నప్పటికీ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించకపోవడం వల్ల ప్రజాధనం అద్దెల రూపంలో వృథా అవుతోంది. కేంద్రం నుంచి నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు ఆలస్యం కావడం ప్రజల్లో నిరాశను పెంచుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకుని సౌకర్యవంతమైన భవనాలను నిర్మించకపోతే ప్రజల సహకారంతో ఉద్యమం చేపట్టాలని స్థానిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా కూడా కొనసాగుతున్నారు .అయినప్పటికీ సొంత నియోజకవర్గంలో సమస్యను పట్టించుకోకపోవడం పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది .గత వైసిపి ప్రభుత్వంలో కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగారు . అప్పుడు కూడా ఈ సమస్య పై సరైన దృష్టి సారించలేదు . ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పెద్దలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





Total views : 75060