అమరావతిలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి.. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని జులై మూడో వారంలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా పాఠశాలల పనితీరు, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ఈ నెల 29న నిర్వహించనున్న “షైనింగ్ స్టార్స్” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే సెట్ పరీక్షలను సకాలంలో, పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.రాష్ట్రానికి ఎన్సీసీ స్టేట్ యూనిట్ మంజూరు కావడం సంతోషకర పరిణామమని పేర్కొన్న మంత్రి.. యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపునకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.విద్యా రంగంలో నాణ్యత పెంపు, విద్యార్థుల భవిష్యత్కు ఉపయోగపడే కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.






Total views : 146917