పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు తెరపడింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎట్టకేలకు చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటిస్తూ, ఈ శాంతి ఒప్పందానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఎలాంటి అదనపు సుంకాలు లేకుండా తెరిచామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని తాను ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ వాణిజ్య రంగాన్ని ఉద్దేశించి ట్రంప్ తనదైన శైలిలో… ప్రపంచంలోని నౌకలు… మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి… ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను ప్రారంభించండని పిలుపునిచ్చారు.
మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించారు. ఈ నెల 19వ తేదీన ఇరు దేశాల ప్రతినిధులు ఈ శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు స్విడ్జర్లాండ్ వేదిక కానుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం… ఇరు దేశాలు తమ మిలటరీ ఆపరేషన్లను పూర్తిగా నిలిపివేస్తాయని షెహబాజ్ స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు, ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు ఇరు దేశాలు దౌత్యపరమైన అత్యుత్తమ పరిష్కారాన్ని ఎంచుకోవడం అభినందనీయమన్నారు. ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందం ఖరారు కావడంలో ఖతార్ దేశం అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని పాక్ ప్రధాని కొనియాడారు. ఇరు దేశాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన మిగిలిన అన్ని దేశాలకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.





Total views : 146666