కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ.993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ తాజా పెంపుతో హైదరాబాద్లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.3,315కు చేరింది. ఢిల్లీలో రూ.3,071కి చేరింది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ధరల ప్రభావం అధికంగా ఉంటోంది. ఈ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం మరింత పెరగనుంది. పెరిగిన ఈ భారాన్ని వ్యాపారులు వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉందని, ఫలితంగా బయట ఆహార పదార్థాల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి వాణిజ్య సిలిండర్పై ధర పెరగడం ఇది మూడోసారి. మార్చిలో రూ.144, ఏప్రిల్ ఒకటిన రూ.195, ఇప్పుడు అమాంతం రూ.993 పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర రూ.3వేలు దాటింది. ఈ ప్రభావం రెస్టారంట్లు, హోటళ్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. దేశీయ విమాన సంస్థలకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఇక, ఐదు కిలోల సిలిండర్ ధర రూ.914.కి పెరిగింది. ఇక చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సమీక్షిస్తుంటాయి. తదుపరి సమీక్ష జూన్ 1న జరగనుంది.



Total views : 62318