పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. జిల్లాలో పండిన వరి పంట, కొనుగోలు పరిస్థితులపై అధికారులు, రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు, అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించిన మంత్రులు వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికంగా వరి దిగుబడి వచ్చిందన్నారు.
అలాగే రైతులను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అయోమయానికి గురిచేస్తున్నాయని ఆరోపించిన మంత్రులు.. రైతుల పట్ల అన్యాయం జరిగితే మిల్లర్లు, ట్రేడర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ సీజన్లోనే 11 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూడా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.






Total views : 89070