భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి, దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన పలు కీలక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. జార్ఖండ్ హైకోర్టులో తీర్పుల వెల్లడి, వాటి అప్లోడింగ్లో జరుగుతున్న సుదీర్ఘ ఆలస్యంపై దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా సుమున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం.. హైకోర్టులు తాము రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల లోపు తప్పనిసరిగా వెల్లడించాలి. అలాగే బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజు ఇవ్వాలని, ఒకవేళ ఆర్డర్ను రిజర్వ్ చేస్తే మరుసటి రోజే దానిని కచ్చితంగా వెల్లడించాలని స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను తక్షణమే ట్రయల్ కోర్టులకు సమాచారం అందించాలని, బెయిల్ పొందిన విచారణ ఖైదీలను అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, అదే రోజు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యాయస్థానాలు తీర్పులను ప్రకటించిన 24 గంటల లోపు వాటిని ఆయా హైకోర్టుల అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా, ఒక తీర్పులోని ప్రధాన కార్యాచరణ భాగాన్ని ప్రకటించిన తేదీనే, ఆ తీర్పు వెల్లడించిన పూర్తి తేదీగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. వేలాది మంది ప్రజలు న్యాయం కోసం ఆశ్రయించే ప్రాథమిక సంస్థలు హైకోర్టులేనని, అందువల్ల సకాలంలో తీర్పులు ఇవ్వడం అత్యంత ఆవశ్యకమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అయితే, ఈ మార్గదర్శకాలు ఏ ఒక్క వ్యక్తిగత న్యాయమూర్తిని, వ్యవస్థను ఉద్దేశించి చేసిన విమర్శలు కావని కోర్టు స్పష్టం చేసింది.
Tag:






Total views : 89056