చెరువు శిఖం భూమిని ఆక్రమించిన వారిని చూశాం… FTL లోకి చొచ్చుకొచ్చిన వారిని చూశాం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా చెరువు కట్టనే మాయం చేసిన వారిని చూశారా.. అయితే మంచిర్యాల శివార్లలోని నస్పూర్ లో జరిగిన ఈ ఘోరం చూడండి. కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న నస్పూర్ చెరువు 144 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికే చెరువు చుట్టూ స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేశారు. తమ భూముల్లోకి నీరు రాకుండా ఎత్తుగా మట్టి పోశారు. అయితే ఎండాకాలం కావడంతో చెరువులో నీటి మట్టం తగ్గింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు.. కట్టను చదును చేసి 10 గుంటల వరకు భూమిని ఆక్రమించారు. ఇలా గ్రీన్ సిటీ వైపున ఉన్న కట్ట మాయం కావడంతో.. ఇప్పుడు చుట్టుపక్కల కాలనీల్లో భయం మొదలైంది. వర్షకాలంలో చెరువు నిండితే ఆ నీరంతా తమ కాలనీలను ముంచెత్తుతుందని వారు ఆందోళన చెందుతున్నారు…
చెరువు శిఖం 126 సర్వే నెంబరులో ఉండగా అందులో 80 మీటర్ల పొడవున కట్టను చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేయడం వెనుక అధికారుల అండ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కబ్జాలు జరిగినప్పుడో, లేదా ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడో… మొక్కుబడిగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పరిశీలించి వెళ్లడం తప్ప తీసుకున్న చర్యలేమీ లేదు. దీంతో కబ్జాలు మరింతగా పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు శిఖం భూమితోపాటు, బఫర్ జోన్ నిబంధనలను పక్కనపెట్టి ఆక్రమణలు కొనసాగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది..
ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి చెరువు శిఖం భూములను రక్షించాలని కబ్జా చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు…





Total views : 75185