కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఏఐఎన్ఆర్సీ పోటీ చేసిన 16 స్థానాల్లో 12 చోట్ల ఘన విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాలను గెలుచుకుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. ఇందులో డీఎంకే 5 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పుదుచ్చేరి రాజకీయాల్లో అత్యంత సామాన్యుడిగా, మృదుభాషిగా పేరున్న ఎన్. రంగస్వామికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. గతంలో నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, ఇప్పుడు ఐదోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమిలో సమన్వయం సాధిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరనున్నారు. దాంతో పుదుచ్చేరిలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరడం ఖాయమైంది.




Total views : 75079