తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని సంచలనం నమోదైంది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి, డీఎంకే సీనియర్ నేత పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. శివగంగై జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గంలో ఆయనపై..TVK అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చారిత్రక విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న పెరియకరుప్పన్కు తుది ఫలితం షాక్ ఇచ్చింది. TVK అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి 83 వేల 375 ఓట్లు రాగా, మంత్రి పెరియకరుప్పన్కు 83 వేల 374 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కేసీ తిరుమారన్ 29 వేల 54 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఫలితంతో తిరుపత్తూరులో 2006 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న పెరియకరుప్పన్ 20 ఏళ్ల అజేయ ప్రస్థానానికి తెరపడింది.
ఫలితం వెలువడిన వెంటనే రీకౌంటింగ్ నిర్వహించాలని డీఎంకే ఏజెంట్లు కోరినప్పటికీ అందుకు అధికారులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాన్ని మద్రాస్ హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన TVK ..108 స్థానాల్లో గెలిచి, అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించిన వేళ ఈ విజయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.





Total views : 75059