ఇండియా పోస్ట్ వినియోగదారుల కోసం సరికొత్త, వేగవంతమైన సేవల్ని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విప్లవాత్మకమైన మార్పుతో ఇకపై ఉత్తరాలు, పత్రాల కోసం రోజులతరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కేంద్ర సమాచారశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి న్యూఢిల్లీలోని గ్యారెంటీడ్ నెక్స్ట్ డే డెలివరీ సేవల్ని ప్రారంభించారు. ఇండియా పోస్ట్ తన నెట్ వర్క్ ను ఈ కొత్తసేవలతో మరింత బలోపేతం కానుంది. ఇందులో మూడు కేటగిరీలను వినియోగదారులకు పరిచయం చేసింది. ఉత్తరాలు, పత్రాల కోసం 24 స్పీడ్ పోస్ట్, వస్తువుల ఫాస్టెస్ట్ డెలివరీ కోసం 24 స్పీడ్ పోస్ట్ పార్శిల్, నిర్ణీత సమయంలో డెలివరీ చేసే సేవల కోసం 48 స్పీడ్ పోస్ట్ కేటగిరీలను తీసుకొచ్చింది. తొలివిడతలో ఆరునగరాల్లో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా వంటి నగరాల్లో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.
ఇండియా పోస్టులో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 24 గంటల్లో ఇండియా పోస్ట్ డెలివరీ సేవలు ప్రారంభించడం ద్వారా 30 కోట్లమంది ఈ-కామర్స్ వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కొత్తగా వచ్చే సేవలతో గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లాజిస్టిక్స్ లో 60 శాతం వాటా ఈ ప్రాంతాల నుంచే వస్తోందని పెమ్మసాని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ ట్రాకింగ్, ఓటీపీ డెలివరీ, జియో ట్యాగింగ్ విధానాలను ఇండియా పోస్ట్ డెలివరీల్లోనూ అమలు చేస్తున్నామని, 24-48 గంటల్లో 98 శాతం డెలివరీలు పూర్తిచేయాలన్నదే ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రైవేట్ కొరియర్లతో పోలిస్తే తపాలాశాఖలో ధరలు తక్కువగా ఉంటాయన్నారు. అలాగే బిజినెస్ కస్టమర్లకు బుక్ నౌ – పే లేటర్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇది కేవలం చిన్న మార్పు మాత్రమే కాదని, వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణ అని అభివర్ణించారు. ఇండియాపోస్టులో ఆర్థిక అభివృద్ధి కీలకమని పెమ్మసాని వెల్లడించారు.






Total views : 89042