ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
దేశంలోని విమానాశ్రయాలు, సముద్ర తీర పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎబోలా స్క్రీనింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే వైరస్ గుర్తింపు, టెస్టింగ్, నిఘా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థలకు సూచనలు చేశారు. కేంద్రమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వివిధ శాఖలు, ఏజెన్సీల ఉన్నతాధికారులతో సమావేశమై వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.






Total views : 89042