ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా కేసులు కలవరపెడుతున్నాయి. రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే ఎబోలాతో 220 మందికిపైగా మృతి చెందగా..మరో 101 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఎబోలా అంతకంతకూ పంజా విసురుతుండటంతో పొరుగునే ఉన్న ఉగాండా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగోతో ఉన్న సరిహద్దును వెంటనే మూసేయాలని అధికారులను ఆదేశించింది. సరిహద్దు దాటి వచ్చిన కాంగో ప్రజల నుంచి స్థానిక ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకడం, ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
తూర్పు కాంగోలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. దాదాపు 220 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 101 కేసులు నిర్ధారణ అయ్యాయని.. మరో 3వేల మంది కాంటాక్ట్ల గురించి ఆరా తీస్తున్నట్లు కాంగో ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉగాండాలో ఏడు ఎబోలా కేసులు నమోదయ్యాయి. మొదటి కేసుగా బయటపడిన 59 ఏళ్ల వ్యక్తి.. మే 14న రాజధాని కంపాలాలో మృతి చెందారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని..షేక్ హ్యాండ్ వద్దని, శానిటైజర్ వాడాలని అధికారులు సూచించారు.
మరోవైపు భారత్లో.. కాంగో నుంచి వచ్చిన ఓ వ్యాపారవేత్త సహా నలుగురిని గుజరాత్ ప్రభుత్వం ఐసోలేషన్ చేసింది. అహ్మదాబాద్లోని వేర్వేరు ఆస్పత్రుల్లో వారిని చేర్చింది. వారి నమూనాలను ఎబోలా పరీక్ష కోసం పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్ తెలిపారు. బెంగళూరులోనూ ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో.. వైద్య విభాగం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






Total views : 89042