ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గంలోని పండువారిపేటలో జరిగే గ్రామసభలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు మాచవరం జయంతి నగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం బుడుంగపేటలో పార్టీ కేడర్తో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.
కోనసీమలో దశాబ్దాలుగా పరిష్కారం కాని గ్రౌండ్ రెంట్ భూముల సమస్యపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, రామచంద్రాపురం ప్రాంతాల్లోని 56.37 ఎకరాల భూములు 22-A నిషేధిత జాబితాలో ఉండటంతో 1,416 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. క్షేత్రస్థాయి విచారణల అనంతరం వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. దీనివల్ల 1,281 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. నేటి పర్యటనతో భూ హక్కులపై ప్రజలకు మరింత భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.