తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజు కూడా రాజకీయ వేడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ నేతల అరెస్టుల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల అంశం సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. తాతా మధు, నవీన్ రెడ్డిలపై తీసుకున్న చర్యలు, కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ డిమాండ్పై బీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉంది.
మరోవైపు సభలో మహిళా ఎమ్మెల్యేల గౌరవానికి సంబంధించిన అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం పట్టుబట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం, అరెస్టు చేయడంపై కూడా ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగే అవకాశం ఉంది. దీంతో సభ ప్రారంభం నుంచే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయ అంశాలతో పాటు ప్రజా సమస్యలపైనా బుధవారం సభలో చర్చ జరగనుంది. వరి సాగు, ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు, విచారణ పురోగతి వంటి అంశాలు చర్చకు రానున్నాయి. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు, 22-ఏ భూముల వివాదాలు, చేనేత కార్మికుల సంక్షేమం, బీసీ మహిళల స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. ప్రజా పాలనకు సంబంధించిన కొన్ని సవరణ బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో మూడో రోజు సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి.