ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. ఓటర్లు రెండు చోట్లా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు పార్టీలు తమ దృష్టికి తెచ్చాయని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్వేర్ తమ వద్ద లేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను బట్టి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న వారిని ఓటు వేయకుండా అడ్డుకోలేమన్న విషయం స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉందని ముకేశ్కుమార్ మీనా తెలిపారు. నిన్న ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. జనవరి 1 నాటికి పూర్తి జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటి వరకు ఆ పనిచేయని వారు డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 లేదంటే జులై 1 లేదా, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండితే కనుక అలాంటి వారు కూడా ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అలాగే, 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్టు వెల్లడించారు.
Andhra Voters
ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల వివరాలను ఆన్లైన్లో ఉంచారు. ఈసీ వెల్లడించిన ముసాయిదా జాబితా ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల రెండు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య రెండు కోట్ల మూడు లక్షల ఎనభై ఐదు వేలమందికి పైగా ఉన్నారు. 2కోట్ల3 లక్షల85 వేల 851 పురుష ఓటర్ల సంఖ్య ఒక కోటీ తొంభై ఎనిమిది లక్షల ముప్పయి ఒక్క వేలకు పైగా ఉన్నారు. సర్వీసు ఓటర్లు 68 వేల 158 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలోని అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తామని ఈసీ పేర్కొంది. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది.





Total views : 77949