కరీంనగర్లో ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వన్ హాస్పిటల్లో మంత్రి అడ్డూరి లిఫ్ట్ ప్రమాద ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇదే సమయంలో చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు లేఖ రాస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని ఆసుపత్రులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని, అర్హత లేని డాక్టర్లు, సిబ్బందితో శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆరోపించారు.
కరీంనగర్ పట్టణంలో అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అత్యంత దయనీయంగా ఉన్నాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆందోళన వ్యక్తం చేశారు. లిఫ్టులు, వీల్చైర్లు, బెడ్లు వంటి అత్యవసర సౌకర్యాలు సరిగా లేవని, పారిశుద్ధ్యం కూడా దారుణంగా ఉందని అన్నారు. వైద్యం పేరుతో వ్యాపారం జరుగుతోందని, చిన్న జ్వరానికి కూడా అనవసర పరీక్షలు రాసి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లాలో సరైన అనుమతులు, అర్హతలు లేకుండానే ఆసుపత్రులు నడుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తక్కువ జీతాలకు అనుభవం లేని సిబ్బందిని నియమించి శస్త్రచికిత్సలు చేయించడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. రోగుల భద్రతపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై సమగ్ర తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వ లక్ష్యం పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమేనని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని ప్రభుత్వం ఏమాత్రం సహించదని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడే ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపాల్సిందేనని వ్యాఖ్యానించారు. వన్ హాస్పిటల్లో జరిగిన లిఫ్ట్ ప్రమాద ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలోని ప్రైవేట్ వైద్య రంగంపై దృష్టి సారించడంతో కరీంనగర్ వైద్య వ్యవస్థలో రైళ్లు పరుగెడుతున్నాయి.
కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్..
31






Total views : 76668