యూపీలో గాలివాన సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 117 మంది మృతి చెందగా, 72 మంది గాయపడ్డారు. యూపీలో కురిసిన అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, భారీ క్యుములోనింబస్ మేఘాలు అనేక ప్రాంతాలను కమ్మేశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో భారీ హోర్డింగులు, రేకుల షెడ్లు ఎగిరిపోగా, చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమవగా, శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. భదోహి జిల్లాలో ఓ వంతెన కూలి అనేక మంది గంగానదిలో పడిపోయారు. మీర్జాపూర్లో మరో వంతెన దెబ్బతిని దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుపాట్లకు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 117 మంది మృతి చెందగా, 72 మంది గాయపడ్డారు. 170 పశువులు మృత్యువాత పడ్డాయి. 227 ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 24 మంది మృతి చెందగా, భదోహీలో 18 మంది, మీర్జాపూర్లో 15 మంది, ఫతేపూర్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నావ్, బదాయూన్, ప్రతాప్గఢ్, బరేలీ, సీతాపూర్, రాయ్బరేలీ, చందౌలీ జిల్లాల్లో కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది.
బరేలీ జిల్లాలోని బమియానా గ్రామంలో భారీ గాలులకు నన్హే మియా అనే ఆటో డ్రైవర్ రేకుల షెడ్డుతో పాటు సుమారు 50 అడుగుల ఎత్తుకు ఎగిరి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయాడు. కొట్టుకుపోతున్న రేకుల షెడ్డును ఆపబోయి అతడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో చేతులు, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడిన నన్హే మియా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలపై అధికారులు వెంటనే స్పందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.





Total views : 76728