ఐదు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి బయలుదేరారు. నేటి నుంచి 20 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించనున్నారు. ఆయా దేశాలతో వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, ఆవిష్కరణలు, హరిత వృద్ధి వంటి రంగాలలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు చర్చలు జరపనున్నారు. అలాగే యూరప్, గల్ఫ్ ప్రాంతాలతో భారత్ సంబంధాలను మరింత పటిష్ఠం చేయనున్నారు. ఆరు రోజుల పాటు ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు.
ప్రధాని మోదీ మే 15న యూఏఈ పర్యటనతో తన విదేశీ యాత్రను ప్రారంభిస్తారు. అక్కడ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కలుస్తారు. నెహ్యాన్తో ఇంధన సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ సమస్యలపై చర్చిస్తారు. యూఏఈ పర్యటన తర్వాత నెదర్లాండ్స్లో పర్యటిస్తారు. అక్కడ నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్తో చర్చలు జరపడంతో పాటు, కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలవనున్నారు. ఈ పర్యటనలో సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఆవిష్కరణలు, రక్షణ రంగం, నీటి నిర్వహణ వంటి రంగాలపై ప్రధాని మోదీ దృష్టి సారించే అవకాశం ఉంది.
మే 19న నార్వేలోని ఓస్లోలో జరగబోయే మూడో భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్ దేశాల నాయకులు కూడా పాల్గొంటారు. మే 19-20 తేదీలలో ఇటలీలో పర్యటించనున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఆ దేశ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాలతో మోదీ చర్చలు జరపనున్నారు. స్వచ్ఛ ఇంధనం, రక్షణ, సాంకేతిక రంగాలలో భారత్-ఇటలీ సహకారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.





Total views : 76806