మధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గత 2003లో కుదిరిన ASI ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాంగణంలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేయడానికి, ముస్లింలు ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉండేది. అయితే ఈ ప్రాంగణంపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని ప్రత్యేక పూజా హక్కులు ఇవ్వాలని హిందూ పక్షం హైకోర్టును ఆశ్రయించింది.
ఈ స్థలం తమదంటే తమదే అంటూ ఇండోర్ హైకోర్టును ఇరువర్గాలు ఆశ్రయించాయి. దీంతో ఇక్కడ శాస్త్రీయ సర్వే జరగాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో 2024లో 98 రోజుల పాటు పురావస్తు శాఖ సర్వే (ASI ) నిర్వహించింది. అనంతరం 2 వేల పేజీలకుపైగా ఉన్న నివేదికను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించింది. మసీదు నిర్మాణం కంటే ముందే అక్కడ భారీ ఆలయం ఉన్నట్లుగా ఆ ప్రాంతంలో లభించిన పలు శిల్పాలు, స్తంభాల శిథిలాలు, శాసనాలు తెలియజేస్తున్నాయన్నారు. ఇవి పర్మార్ రాజవంశం కాలానికి చెందినవని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో లభించిన పురాతన నాణేలు, శిల్పాలు, సంస్కృత శాసనాలు ఈ ప్రాంగణం ఒకప్పుడు దేవాలయమే అనడానికి బలమైన సాక్ష్యాలని హిందూ పక్షం వాదించగా ASI నివేదిక ఏకపక్షంగా ఉందంటూ ముస్లిం పక్షం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చరిత్ర, శాస్త్రీయ ఆధారాలు, చట్టపరమైన నిబంధనలను పరిశీలించిన కోర్టు.. మే 12న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పును ప్రకటించింది




Total views : 77261