ఏపీలో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధమవుతోంది. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడంతో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. 37 భారీ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై బోర్డు సమగ్రంగా చర్చించింది. మొత్తం 2.08 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించేలా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి సచివాలయంలో 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయడం, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ సమావేశం ముందుకు వివిధ రంగాలకు చెందిన ఏకంగా 37 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా ఏపీకి సుమారు 2.08 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, ఐటీ రంగాలకు చెందిన ప్రతిపాదనలను సీఎం విస్తృతంగా సమీక్షించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల పెట్టుబడులపైనా ప్రత్యేకంగా చర్చించారు.
పెట్టుబడుల ప్రతిపాదనలకు కేవలం అనుమతులు ఇవ్వడమే కాకుండా.. క్షేత్రస్థాయిలో పనులు వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని స్పష్టం చేశారు. భారీ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.