తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలు ప్రత్యక్షంగా పాల్గొనగా, జిల్లాలు, నియోజకవర్గాలు, క్లస్టర్ల స్థాయిలో నాయకులు, కార్యకర్తలు వర్చువల్ విధానంలో హాజరుకానున్నారు. మంగళగిరిలో జరిగే మహానాడుకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రత్యక్షంగా హాజరవుతారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులు తమ తమ నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.
పార్టీకి చెందిన 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు కూడా ఆయా క్లస్టర్ల నుంచే వర్చువల్గా మహానాడులో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఒకేసారి మహానాడును వీక్షించేలా సాంకేతిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మహానాడులో ప్రవేశపెట్టే రాజకీయ, ఆర్థిక, సంక్షేమ తీర్మానాలు సహా అన్ని కార్యక్రమాలు సంప్రదాయ మహానాడు తరహాలోనే నిర్వహించనున్నట్లు టీడీనీ నేతలు వెల్లడించారు. తీర్మానాల ఆమోదం, నాయకుల ప్రసంగాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు అన్నీ హైబ్రిడ్ మోడల్లో కొనసాగనున్నాయి.





Total views : 78340