అంబేద్కర్ కోనసీమ జిల్లా…రాజోలు – Antarvedi
Lakshmi Narasimha Temple, Antarvedi దక్షిణ కాశీగా పేర్గాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేద మంత్రోశ్చరణలు, భక్తుల జయ జయ ద్వానాల మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వైఖానస ఆగమనానుసారం ఆరుద్ర నక్షత్ర యుక్త వృచ్చిక లగ్నం శుభఘడియల్లో వివాహ ఘట్టం వైభవంగా నిర్వహించారు.
Follow us on :Facebook, Instagram&YouTube.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత నారసింహున్ని ముత్యాల పల్లకిలో కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం ప్రారంభమైన కళ్యాణ క్రతువు ఘనంగా సాగింది. దివ్య ముహూర్త సమయమైన రాత్రి 12గం 29 నిమిషాలకు దేవతామూర్తుల శిరస్సు పై జీలకర్ర బెల్లం పెట్టారు.
మంగళ సూత్ర ధారణను పండితులు రమణీయంగా సాగించారు. తలంబ్రాల ఘట్టాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. భద్రాచలం తరువాత బహిరంగంగా అశేష భక్త జనం మద్య కళ్యాణం నిర్వహించడం అంతర్వేది లోనే కావడం విశేషం. కళ్యాణం ఆద్యంతం భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు కళ్యాణ ప్రాకారంలోనే కాక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన LED స్క్రీన్ లపై కూడా కళ్యాణాన్ని తిలకించారు.
స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి చెల్లుబోయిన వేణు దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టిటిడి బోర్డు సభ్యులు మేకా శేషుబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, జిల్లా కలక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ శ్రీధర్, పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు పట్టువస్త్రాలు సమర్పించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 62042