పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్దాలే మాట్లాడారని, ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ… 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క కొత్తగూడెం మాత్రమే గెలిచిందని, దీంతో పార్టీ బలోపేతం కోసం నన్ను బతిమాలి పార్టీలో చేర్చుకొలేదా? అని ప్రశ్నించారు. నేను పార్టీలో చేరిన రోజూ జిల్లా పరిషత్ చైర్మన్ డీసీఎంఎస్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వందల మంది సర్పంచ్లు పార్టీలో చేరింది నిజంకాదా? డిపాజిట్లు రాని పార్టీని జిల్లాలో నేను బలోపేతం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. 40 ఏళ్ల సహవాసంలో నా నిబద్ధత ఏమిటో కేసీఆర్కు తెలుసునన్నారు. అలాంటి మీరు పార్టీ మారిన పువ్వాడ అజయ్ కుమార్కు ప్రభుత్వ భూములు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డికు కాంట్రాక్ట్లు ఇచ్చి… వారిని పక్కన పెట్టుకొని నాపై విమర్శలు చేస్తారా? నేను పార్టీ మారితే మీరుచేసిన వ్యాఖ్యలు జిల్లా ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని, ఇక్కడి ప్రజల కోసం మీ రాజకీయ విమర్శలను భరిస్తానన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీకి ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని, మానసిక దౌర్బల్యంతోనే కేసీఆర్ తనపై విమర్శలు చేశారన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా తెలిసి కూడా నీ స్వార్థం కోసం మాట్లాడతావా అని మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లో చేరిన సమయంలో అక్కడకు వచ్చిన వారిని చూసి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు లేవా? అన్నారు. మనం పార్టీ మారినా ఇంతమంది మనతో రారని కేటీఆర్ అనలేదా? తుమ్మలతో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రభంజనంలా వచ్చి చేరారని చెప్పింది మర్చిపోయావా? పదవుల కోసం కాదు సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టుల కోసమే తాను పార్టీలో చేరుతున్నట్లు ఆ రోజే చెప్పానన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో తనను అపర భగీరథుడని పొగిడిన పొగడ్తలు జిల్లా ప్రజానీకం చూశారని, పాలేరులో నా ఓటమికి నీ కుమారుడే కారణమన్న విషయం మీకు తెలుసు అన్నారు. మా కత్తితో మేమే పొడుచుకున్నామని మీరే మీడియా ముఖంగా చెప్పారు, ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపులో నా పాత్ర లేదా? అని తుమ్మల ప్రశ్నించారు. ఓడిపోయి మూలన కూర్చుంటే మంత్రి పదవి ఇచ్చానని, పార్టీ కోసం చేసింది నేను సున్నా అని చవకబారు విమర్శలు చేస్తావా? అని ధ్వజమెత్తారు.
Ktr
రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రైతులపై అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతు బంధు, పెన్షన్, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు… నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు… నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు… నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు… నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే…’ అని రేవంత్ పేర్కొన్నారు. నీలాంటి వాడిని చూసే… ‘నిజం చెప్పులు తొడుక్కునే లోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది’ అనే సామెత పుట్టిందని విమర్శించారు. కేటీఆర్, బీఆర్ఎస్ తమ డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని వ్యాఖ్యానించారు.
అవసరమైన సమయంలో విద్యుత్ సరాఫరా చేయడం లేదని, కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్కు ట్రాక్టర్లో ఓ మొసలిని తీసుకొచ్చారు. కరెంట్ ఇస్తారా?.. సబ్ స్టేషన్లో మొసలిని వదలాలా? అంటూ సిబ్బందిని రైతులు ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా, ఈ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’ అంటూ కాంగ్రెస్ సర్కారుపై సెటైర్లు సంధించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావు కలిసి చెరుకు సుధాకర్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు శనివారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కేటీఆర్.. తమ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పట్టించుకోవద్దన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా చాలా ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. ప్రవళిక చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మేము ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పామన్నారు.హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతున్నారన్నారు. గజ్వేల్లో పోటీ చేసిన ఈటెల గెలవరు’ అని కేటీఆర్ అన్నారు.
గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి కేటీర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడో.. ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరు కోపం ఉన్నా… కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందన్నారు. బీఫారాల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్.. ఫలితాల్లోనూ ముందే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు 40చోట్ల అభ్యర్థులు లేరని, బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని విమర్శించారు. భాజపా అభ్యర్థులు ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారన్నారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు 24వేలు అని చెప్పిన కేటీఆర్.. అందులో తెలంగాణ వాటా 10వేలని వివరించారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో 1,34,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు. మిగిలిన 90వేల నియామకాలు వివిద దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే.. తాము 13వేలు ఇచ్చామని వెల్లడించారు. భారాస 30 వైద్య కళాశాలలు పెట్టిందని గుర్తు చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు.. ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో.. మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఏ మాత్రం పోటీ కాదని, రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతలు ఏమాత్రం సరితూగరని విమర్శించారు. కర్ణాటకలో 5గంటల కరెంటు కోత వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో ఒకే పంటను పరిమితి మేరకు కొనుగోలు చేస్తారని, వాళ్లు మాకు సుద్దులు చెబుతారా? అని విమర్శించారు. గతంలో ఖమ్మంలో తమకు నేతలు నిండుగా ఉన్నా… ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు. ఈసారి కొందరు నేతలు వెళ్లారు.. సీట్లు పెరుగుతాయని అనుకుంటున్నాం. మణికొండ, మక్తల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని కేటీఆర్ విమర్శించారు.