తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాల్లో ఇకపై ప్రతిసారి ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేకుండా “మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు” జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణాల కోసం మహిళలు ప్రతి సారి ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించాల్సి వస్తుండగా… ఇకపై ఆ అవసరం తగ్గనుంది. “మహాలక్ష్మి స్మార్ట్ కార్డు” ద్వారా కేవలం కార్డు స్కాన్ చేస్తే సరిపోతుంది.
ఈ పథకాన్ని తొలుత ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక మండలంలో ప్రారంభించి.. అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. అర్హులైన మహిళలు సమీప బస్ పాస్ కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాల్లో రూ.50 నామినల్ ఫీజుతో ఈ కార్డులను పొందవచ్చు.స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వచ్చే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగానే ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. ఈ విధానం వల్ల కండక్టర్ల తనిఖీ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు మహిళలకు కూడా మరింత సౌకర్యం కలగనుంది.






Total views : 89056