కలియుగ వైకుంఠం తిరుమలలో దళారుల ఆటకట్టించేందుకు టీటీడీ నడుం బిగించింది. ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేస్తూ.. సామాన్య భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కుల గుట్టు రట్టు చేసేందుకు హైటెక్ అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఇకపై కేవలం కార్డు చూపిస్తే సరిపోదు.. మీ ముఖం, మీ వేలిముద్ర కూడా ఆధార్ డేటాతో మ్యాచ్ కావాల్సిందే.ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సేవలను టీటీడీ వినియోగించుకోనుంది. ఇప్పటికే ఇరు విభాగాల మధ్య చర్చలు సఫలమయ్యాయి. టీటీడీని ‘అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ’గా రిజిస్ట్రేషన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండేళ్ల కాలానికి గాను రూ.20 లక్షల రుసుము చెల్లించేందుకు టీటీడీ సిద్ధమైంది.”
ఈ కొత్త విధానంలో ఆధార్ నిర్ధారణతో పాటు ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ కీలకం కానుంది. ఒకరు తీసుకున్న టికెట్పై మరొకరు వెళ్లే ఛాన్స్ లేకుండా టెక్నాలజీ నిఘా పెడుతుంది. ప్రతి ఈ-కేవైసీ లావాదేవీకి కొంత మొత్తాన్ని ఉడాయికి చెల్లిస్తూ.. పక్కాగా భక్తుల వివరాలను సరిపోల్చనున్నారు అధికారులు. అయితే ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో.. ఇప్పటికే టీటీడీ సంప్రదింపులు మొదలుపెట్టింది. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపులో పారదర్శకత పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. సామాన్య భక్తులు నేరుగా సేవలు పొందేలా ఈ వ్యవస్థ దోహదపడనుంది. ఈ విప్లవాత్మక మార్పుతో తిరుమలలో దళారుల దందాకు శాశ్వతంగా అడ్డుకట్ట పడనుంది.





Total views : 47727