Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Telangana అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు..

అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు..

by CVR NEWS

రాష్ట్రంలోని అనాథ యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సోమవారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో జీఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కి, అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీలతో మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత, వారికి కేవలం ఆశ్రయం కాదు, భవిష్యత్తు కల్పించడమే లక్ష్యం అన్నారు.

పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని స్వతహాగా ఎదిగేలా తీర్చిదిద్దడం ప్రభుత్వ కర్తవ్యం అని పేర్కొన్నారు. సమగ్ర పునరావాసం, శిక్షణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే మార్గదర్శక నిర్ణయంగా నిలవనుందని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్లలోపు చిన్నారుల కోసం క్రష్ సెంటర్లు ఏర్పాటు చేసి, అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతున్న కాలానికి, అవ‌స‌రాల‌కు అనుగుణంగా అంగ‌న్వాడీ టీచ‌ర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమం మార్చి నుండి శంషాబాద్‌లో ప్రారంభం కానుంది. ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇచ్చి, ప్రైవేట్, అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలకు సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యం. మొదటి విడతలో 20 మంది అనాథ యువతకు శిక్షణ అందించనున్నారు. ఆ త‌ర్వాత బ్యాచ్ ల వారిగా అర్హులంద‌రికి ట్రైనింగ్ ఇవ్వ‌నున్నారు. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ హెడ్ కే. అనంతరామన్, ఆపరేషన్స్ హెడ్ ప్రీతి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా హాజరయ్యారు.

పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ బాలికలకు ఇండస్ట్రీ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ శిక్షణ అందించేందుకు ఫిక్కీలేడిస్ అర్గ‌నైజేష‌న్ తో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందాలు చేసుకుంది. స్వస్తిక్ వికాస్ ఫౌండేషన్, అవినాష్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ సర్టిఫైడ్ కోర్సులు అనాథ బాలిక‌లకు నేర్పిస్తారు. క్లాస్ రూం టుం కార్పోరేట్ జాబ్ లక్ష్యంగా 30 గంటల శిక్షణా మాడ్యూల్ ద్వారా విద్యార్థులను ఉద్యోగాలు సిద్దం అయ్యేలా తీర్చిదిద్ద‌నున్నారు. మొత్తం 300 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వ‌డం ద్వారా మంచి ఉద్యోగులు వారికి ల‌భించేలా చేయ‌నున్నారు.

అంగన్‌వాడీ సేవలను బలోపేతం చేయడానికి అజీమ్ ప్రేమ్ జీ యునివ‌ర్సిటీ తో కలిసి 6 నెలల ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు అమలు చేయనున్నారు. ఎర్లి చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేష‌న్ అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. అంగ‌న్వాడీ టీచ‌ర్లంద‌రికి ఈ మోడల్ ద్వారా శిక్షణ ఇస్తారు. 30 గంటల ఆన్‌లైన్ సెషన్లు, 6 రోజుల ప్రత్యక్ష శిక్షణ కలిపి 6 నెలల వ్యవధిలో కోర్సు పూర్తి అవుతుంది. విజయవంతంగా పూర్తి చేసిన వారికి అజీమ్ ప్రేమ్ జీ యునివ‌ర్సిటీ సర్టిఫికేషన్ అందిస్తుంది. టీచింగ్, కేరింగ్, పిల్లల బోధనలో సామర్థ్య పెంపు ఈ శిక్షణలో ప్రధానాంశాలు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అంగన్‌వాడీ టీచర్ల నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా 3 నుండి 6 సంవత్సరాల చిన్నారుల పాఠశాల సంసిద్ధతను మెరుగుపరచడమే ల‌క్షంగా ఈ కోర్సు ప‌నిచేయ‌నుంది

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: