Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News తెలంగాణలో ఎన్నికల ఉత్కంఠ..

తెలంగాణలో ఎన్నికల ఉత్కంఠ..

by Rama
election excitement

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎందుకిలా చేశారో.. ఎవరికీ అర్థం కాలేదు. తమ సత్తా చూపించుకోవడానికో.. లేదంటే ట్రెండ్ క్రియేట్ చేయడానికో తెలియదు గానీ.. రెండేసి స్థానాల్లో పోటీలో నిలబడ్డారు. ఇంతకీ వారెవ్వరో ఈ పాటికే అర్థమైపోయింటుంది. ఒకరు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మరొకరు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇంకొకరు బీజేపీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్. ఈ ముగ్గురూ రెండేసి స్థానాల్లో బరిలోకి దిగి ప్రత్యేకతను చూపించారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రాక ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సీఎం కేసీఆర్ సవాళ్లు విసిరారు. మరోవైపు.. ప్రస్తుతం ఉన్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు కీలక ప్రకటనే చేశారు. ఈ ప్రకటనతో విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. ఓటమి భయంతోనే కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారని విమర్శించాయి. అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా ఎత్తుకు పైఎత్తు వేసి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించేందుకు హస్తం పార్టీ తరపున రేవంత్‌రెడ్డిని కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దింపింది. ఇక్కడ కేసీఆర్‌కు రేవంత్ గట్టి పోటీ ఇచ్చారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంక్ ఉంది. పైగా సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా 1983లో టీడీపీ స్థాపించన దగ్గర నుంచీ.. కామారెడ్డిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే గెలుచుకుంటూ వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ ఓట్లన్నీ హస్తం పార్టీకి డైవర్ట్ అయినట్టుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా రేవంత్‌కు బాగానే కలిసొచ్చాయి. దీనికి తోడు కామారెడ్డిలో రేవంత్ గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పటికే కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయి బీజేపీ తరఫున పోటీచేసిన వెంకట రమణారెడ్డి పక్కాగా గెలుస్తారని సర్వేలు తేల్చేశాయి. ఇక తామేమీ తక్కువ కాదంటూ బీజేపీ కూడా ఈటల రాజేందర్‌ను రెండు చోట్ల బరిలోకి దింపింది. ప్రస్తుత నియోజకవర్గం హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీలో నిలబెట్టింది. ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఈటల కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడతాయని కమలం పార్టీ ధీమాగా ఉంది. అటు నేచురల్‌గా బీజేపీకి వచ్చే ఓట్లు కాకుండా ముదిరాజ్ ఓట్లు కూడా తోడైతే ఈటల సునాయసంగా గెలుస్తారని పువ్వు పార్టీ అంచనా వేసింది కానీ ఫలితం ఎలా ఉంటుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అటు కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి.. ఇటు గజ్వేల్‌లో ఈటల రాజేందర్.. ఇలా రెండు చోట్ల సీఎం కేసీఆర్‌కు గట్టి సవాల్‌ను విసిరారు. గజ్వేల్‌లో ఎలాగున్నా.. కామారెడ్డిలో మాత్రం కేసీఆర్‌కు ఓటమి తప్పదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ హిస్టరీలో ఇదే బిగ్ షాకే. ఇక ఈ ముగ్గురిలో రెండు చోట్ల గెలిస్తే మాత్రం.. ఒకదానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 6 నెలల్లో ఏదొక నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం. మరీ… ఓటర్లు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారో.. తేలిపోనుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: