సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార వ్యక్తులు రాకుండా అడ్డుకునేందుకు సిబ్బంది గేటుకు తాళం వేయడానికి బదులుగా ఈ బేడీలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి.
పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేసి ఉన్న దృశ్యాలు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ గేటుకు వేయడానికి ఒక సాధారణ తాళం కూడా దొరకలేదా? ఖైదీలకు వాడాల్సిన సంకెళ్లను ఇలా గేటుకు వేయడం ఏంటి? అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ విచిత్ర ఘటనపై, మరియు నెటిజన్ల విమర్శలపై సంగారెడ్డి రూరల్ పోలీసు అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది